14, ఫిబ్రవరి 2012, మంగళవారం

నా ప్రేమ!!

ప్రశ్నలకందని జవాబు ప్రేమ! జవాబు దొరకని ప్రశ్నే ప్రేమ!!
కడతేరని కడు రమ్యం ప్రేమ! అలుపెరగని ఓ గమ్యం ప్రేమ!!
అందరికందని అందము ప్రేమ! ఆనందపు అరవిందము ప్రేమ!!
ఆదీ అంతం అంతా ప్రేమ! అనతమనంతమెంతో ప్రేమ!!

10, ఆగస్టు 2010, మంగళవారం

జెండా...

ఈ రోజు..
బాల భానుని తొలి పొద్దు ముద్దు ముద్దు కిరణాలు...
వాటికిందే తెల్లని పిల్ల మేఘాల బృహత్ సమీకరణాలు...
చల్లగాలి పాట పల్లవికి నృత్యమాడే పైరు గణాలు...

అదిగో జెండా ఎగిరింది..
మన జెండా ఎగిరింది ...
నింగీ నేల కలిసి మన భారత జెండా ఎగిరింది....

అదో ప్రస్థానం.. మహా మహా ప్రస్థానం ...
ఖడ్గం కంటే పదునైన మన జెండా ప్ర"స్థానం"...

కాషాయాగ్ని..తెల్లని గాలి...
పచ్చని నేల ..నీలి చక్రపు నీరు..
నింగితో కలిసి పంచ భూతాల సమాహారం ఈ జెండా...

భారతావని గుండె ధైర్యం..
ఆ గుండె ధైర్యపు ఆత్మస్థైర్యం... ఈ జెండా...

భారతీయులందరి సంతకం..
చరిత కావ్యపు మేలు పుస్తకం... ఈ జెండా...

అఖండ భరతఖండ హస్తం..
వందేమాతరగీతపు ప్రియ నేస్తం... ఈ జెండా...

ఈ పండుగనాడు..
మన స్వతంత్ర పండుగనాడు..
మన జెండా పండుగనాడు..
ఈ మన జెండా గారి గురించి....

తెల్లవారిని వెల్లగొట్టేందుకు జాతి జనులందరికీ ఒక ఆయుధం కావాలి..ఆ ఆయుధం ఎర్ర కుక్కలను ఉరుకులు పెట్టించాలి, పరుగులు తీయించాలి, స్వతంత్ర భారత ఫలాలను అందరికీ అందించాలి అనే వజ్ర సంకల్పాయుధం అయ్యింది.."జెండా"గా మారింది...
ప్రతీ భారతీయుడు ఓ సైనికుడు..అలా ప్రతీ సైనికుడూ పేల్చగలిగే తుపాకీ, విసరగలిగే బళ్ళెం, తిప్పగలిగే కత్తి, వేయగలిగే బాణం రూపంలో వందేమాతర నినాద హస్తంలో ఆ జెండా ఒదిగింది...

అలాంటి జెండా, మనమిపుడు ఎగరేస్తున్న జెండాగా రూపంతరం చెందడానికి, త్రివర్ణాలంకృతం కావడానికి, చక్రధారి అవడానికి కాలం చాలా రోజులే ఆలోచించింది.జాతికి గొప్ప వర జెండానందించింది. వందేమాతరం అని రాసుండి దేశ కళలను,మతాలను అభినయిస్తూ ,అనుకరిస్తూ ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్తో 1906 లో మన జెండా నిగివైపుకు ప్రయాణం మొదలెట్టింది. స్వాతంత్రోద్యమం ప్రజ్వలన స్థాయికి చేరుకునేసరికి ఓ స్వేచ్చాకాంక్ష, ప్రతీ భారతీయుడీ ఒకే ఆకాంక్షా తెల్ల దొరల కళ్ళకు కట్టేలా చూపించాలని 1921 లో బెజవాడ(విజయవాడ) అఖిలభారత కాంగ్రెస్ సదస్సులో గాంధీజీ మన పింగలి వెంకయ్య గారు రూపొందించిన జెండాను పరిచయం చేసారు. రెండు రంగుల ఆ జెండా ఎరుపు హిందువులను, ఆకుపచ్చ ముస్లింలను ప్రతిబింభించేలా ఉండేది.

తరువాతి కాలంలో గాంధీజీ చేసిన కొన్ని సూచనలమేరకు మిగిలిన మతాలను తెలుపుతూ ఒక తెల్లని పట్టీ మరియు అభివృద్ధిని సూచిస్తూ "రాట్నం" జెండాలో చేరాయి.1931 లో ఈ జెండా అందరిచేతా ఆమోదించబడి, చేతుల్లోనికి తీస్కునబడింది. ఇలా ప్రయానిస్తూ మన జెండ ఆంగ్ల పాలకులను మన దేశ పొలిమేరలు దాటించింది.

1947 జులై 22న రాజ్యాంగ సంఘం మరిన్ని మార్పులు చేస్తూ జెండాను ఆవిష్కరించింది.అదే ఇపుడు మన కల్లముందు ఎగురుతున్న జెండా. ఇందులో త్యాగాన్ని, ధైర్యాన్ని ప్రతిభింబించే విధంగా కాషాయాన్ని ఎరుపు స్థానం లో పై పట్టీగ, శాంతిని సత్యాన్ని తెలిపే తెలుపు పట్టీని మధ్యలో, వ్యవసాయాన్ని నమ్మకాన్ని చూపించేలా ఆకుపచ్చ పట్టీని కింద ఉండేట్టు రూపొందించారు. తెలుపు పట్టీ పైన ధర్మాన్ని ఆవిష్కరించేదిగా అశోక ధర్మ చక్రాన్ని ఉంచారు.ఆ 24 ఆకుల చక్రాన్ని అశోకుని సారనాథ్ స్థూపం నుంది తీసుకున్నారు.

ఇలా మన జాతీయ జెండా భారతీయుని సుగునాలనే వెలుగులను ప్రసరిస్తూ ఎగురుతోంది...ఎగురుతూనే ఉంది.....

మన తిరంగా జెండాను ఇలా గౌరవించాలి...
  • జెండా ఎగురవేసే ప్రదేశంలో మరే ఇతర జెండాలు జాతీయ జెండా కంటే ఎత్తులో ఎగరరాదు.
  • కాషాయం ఎపుడూ పైకి వచ్చేదిగా జెండాను ఎగరవేయాలి.
  • నిలువుగా కట్టినపుడు కాషాయం ఎడమవైపుకు రావాలి.
  • జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2 గా ఉండాలి.
  • ఎట్టి పరిస్థితుల్లో జెండాను నేలకు తాకనీయరాదు.
  • జాతీయ జెండాను ఏ పార్టీ, మతం ఉపయోగించకూడదు.
  • చిరిగిన జెండాను ఎగురవేయరాదు..

29, మే 2010, శనివారం

పాడు యవ్వనం...

లెక్కలు మారాయ్..
రెక్కలు విరిగాయ్..
బొక్కలు తేలాయ్..
పట్టపగలే యవ్వనాకాశంలో చుక్కలు మెరిసాయ్..!!
శైశవ క్షేత్రంలో పిచ్చి మొక్కలు మొలిసాయ్...!!
ఎందుకొచ్చిందో ఈ పాడు యవ్వనం..
ఏం పాపం చేసిందని నా బాల్యం..?
పాడలేకపోతున్నా ఈ యువగీతం..విప్పలేకపోతున్నా నా నవగాత్రం...

చిక్కులు మిగిలాయ్..
దిక్కులు చేరాయ్..
హక్కులు తెలిసాయ్..
తోకలు తొక్కకముందే నక్కలు ఉరికాయ్..!!
మేకలు మేతకు వెలితే కుక్కలు మొరిగాయ్..!!
ఎందుకింత తొందరపడిందో నా యవ్వనం..
ఏమంత అనుభవించిందని నా బాల్యం..?
గీయలేకపోతున్నా ఏ కొత్త చిత్రం..వీడలేకపోతున్నా ఈ మత్తు మాత్రం...

లక్కులు వదిలాయ్..
కిక్కులు మిగిలాయ్..
పక్కలు అరిగాయ్..
గమ్యం దారిలొ మొదలే పిక్కలు అలిసాయ్..!!
లక్ష్యపు బాటలొ ఏవో చెక్కలు వెలిసాయ్..!!
ఎందుకింత పగబట్టిందో నా యవ్వనం..
ఎక్కడికెలిపోయిందో నా బాల్యం..?
రాయలేకపోతున్నా ఓ మార్పు కవిత్వం..మోయలేకపోతున్నా ఈ వయసు పటుత్వం...


14, మే 2010, శుక్రవారం

పదిలం…

వసంతఋతు ఆగమనం పదిలం..
శరత్ కాలపూ “వెన్నెల” పదిలం..
నా కన్నుల్లో.. నీ రూపం పదిలం..
నా గుండెల్లో..నీ భావం పదిలం..

నీకేదో చెప్పాలని ఎడ్చే…
నా మదిలో శ్వాసలు ఎన్నో పదిలం….!!
నీవైపే చూడాలని తపించు…
కళ్ళలో వేల బాసలు పదిలం…!!

గుడిగంటలాగ నువు నవ్వేస్తావు…
నా గుండె గొంతుకను నలిపేస్తావు..
ఏదో చెప్పాలను నా ఆత్రాన్నీ…
అమాంతం నువ్వు చిదిమేస్తావు…..!!


నీ మాటల్లో.. సంకేతం పదిలం…
నీవల్లే సంతోషం పదిలం…
బరువైన గుండె తలపులు పదిలం…
చెరువైన కళ్ళ చేష్టలు పదిలం….

రక్కసి చూపులు కోరలు చాచగ..
కొంటె తనపు నీ నవ్వులు పదిలం…!!
స్నేహితుడిచ్చాడంటూ చూపిన..
కొత్తపరిమలపు పువ్వులు పదిలం…!!

చిన్ని బాధకే ఏడుస్తావు..
నువ్వేడుస్తూ నన్నేడ్పిస్తావు..
నీకొరకే..నేనేదొ చెప్తే..
వద్దంటూ నన్నాపేస్తావు..!!


తెలిసీతెలియ”నీ” సూక్తులు పదిలం..
బాధలు పదిలం..భయాలు పదిలం..
“రా” అంటూ నీ పలుకులు పదిలం..
తిట్లూ పదిలం..అగచాట్లూ పదిలం..

చంద్రుడు వెన్నై అలా కరిగినా…!!
సూర్యుడు ధరనిని ముద్దులాడినా..!!
నా మనసులో నీ “స్నేహం” పదిలం..
ఈ వయసులో.. ఓ వరమే పదిలం…

పదిలం…
పదిలం…
పదిలం…

కడగండ్లు...

పాపం ఆ పసి హృదయం తల్లడిల్లిపోతుంది..
అన్నం తిని సరిగ్గా మూడు రోజులౌతుంది...
అర్ద రూపాయ్ కోసమైన ఆరు చోట్ల చేయిచాచి..
ఓ ముదుసలి ఓపలేక తన కడుపును నింపుకుంది...
బువ్వ కొరకు చిట్టి చేయి వాత పెడితె ఓర్చుకుంది..
సిగ్గు విడిచి ముసలి మనసు తిట్టినా నవ్వుకుంది...
కార్మికులుగ చిన్నవాళ్ళు గుండె నిండ కన్నీళ్ళు..
దీవించే పెద్దవాళ్ళు కళ్ళ నిండ కడగండ్లు...

నేనెవర్ని...?!

ఎంత తప్పించుకుందామనుకున్నా..
నాకు నేను ఒంటరిగా దొరికిపోయినపుడు...
అమ్మ ఒడికి దూరంగా..
కానీ అంతే గారాబంగా..
నాకు నేను జోల పాడుకున్నపుడు...

ఎవరికి చెప్పుకోవాలో తెలియక..
నాకు నేను అద్దంలో విన్నవించుకున్నపుడు...
చిరుగాలి పరుగెడుతుంటే..
ఆ శబ్దం నను భయపెడుతుంటే..
నాకు నేను ధైర్యం చెప్పుకున్నపుడు...

సమయం నను తిరస్కరిస్తుంటే..
"ఏంకాదు" అని నన్ను నేను హత్తుకున్నపుడు...
తొందర పడుతున్న కాలానికంటే..
అపుడపుడూ నే ముందు పొతుంటే..
నన్ను నేను సంతోషంతో ఎత్తుకున్నపుడు...

ఒంటరిగా ఉంటే గంటలు గంటలు..
నన్ను నేను తుంటరిగా మట్లాడించినపుడు...
రాత్రి ఆకలౌతుందంటూ..
ఈ ఒక్క బుక్కా తినమంటూ..
నన్ను నేను బుజ్జగించుకున్నపుడు...

నాకు నేను ఎమౌతాను..?
నన్ను నేను ఎటు తీసుకుపొతాను..?
అసలు,,...నాకు "నేనెవర్ని"...?

7, ఫిబ్రవరి 2010, ఆదివారం

వెన్నెల..

ఓ మంచి వెన్నెల రాత్రి
చల్లని మంచుల ధాత్రి
ఆకాశంలో ఎవో రెండు తారలు మాట్లాడుతూ ఉంటే..
ఆ మాటలు కూడా చక్కగా వినిపించేంత ప్రశాంత కాంతి...
నింగి నుండి ఎవరైనా తెల్ల కాగితాలను విడుస్తున్నారా..?
దేవతలు పండగ జర్పుకుంటే, పొంగిన పాల నురుగు భూమిపై పడుతుందా...?
అనిపించే చక్కని శ్వేతవర్ణ వెన్నెల బంతి....

అయినా ఆ వెన్నెల ..
తిలక్ వెన్నెల వెల్లువలా
యండమూరివారి "వెన్నెల్లో ఆడపిల్ల"లా కాకుండా
కాస్త వన్నె తగ్గి బాధపడుతున్నట్టుంది...ఎందుకో అడగాలి...

ఇంతైనా..ఆ వెన్నెల ఎంత బాగుందంటే..
మహానుభావుల మనస్సులను ఆకాశంలో ఆరేసినట్టూ..
అన్ని చుక్కలనూ ఒకచోట కట్టి చక్కగా పారేసినట్టూ...
పసి పాప నవ్వంత అందంగా..
ఆకలేస్తే కంచమ్లో పెట్టిన బువ్వంత ఆర్ద్రంగా ..కనిపిస్తుంది...

అడుగుదామా..వద్దా ..అనుకుంటూనే...అడిగేసా
తన ముందుకు ఓ చిన్న అడుగేసా...
వెన్నెలమ్మా..ఓ వెన్నెలమ్మా.."నీ వన్నెలేవమ్మా..?"
"నిన్నటి నీ రజతపు జున్నులేవమ్మా...?"

అంతలోనే..మావాళ్ళందరూ చుట్టూ చేరి నవ్వేసారు..
ఎందుకంటే..
అదో మంచి కల..
మనస్సాగరపు వింత అల..
ఇలలో ఓ సంతోషాల వల..
కుహూ కుహూల శ్యామల కోకిల..
లేచి ఆలోచించా..
ఆహా ఎంత మంచి స్వప్నం..
మెరుపుల మేలుజాతి రత్నం...
విఘ్నాలు రాని మహా యజ్ఞం..
నిత్య సత్యం కాని ప్రయత్నం...

26, ఆగస్టు 2009, బుధవారం

మేఘాలు

భూమి అంచుల్లో మొలిచినట్టున్న మేఘాలు..
అవే బీదోడి హిమాలయాలు...!!
పేదోడి నయాగరా జలపాతాలు...?!!

దేవుళ్ళు

ఇన్నాళ్ళకి కరుణించాడు వరుణ దేవుడు...
తన నిమజ్జనానికై రప్పించుకున్నాడేమో వినాయకుడు...
పండగ ముందే వస్తే కబలించకపోయేవాడేమో యముడు...

8, ఆగస్టు 2009, శనివారం

పాపం అవ్వ....

తెగ పెరిగెను అక్రమాలు..
ఎన్నో వికృత చేష్టలు....
మరి తరిగెను బీదగూళ్ళు ప్రకృతి చేతన్....
అవ్వ నవ్వె..బువ్వ చూసి..
తిందామని చెయ్యివేసి...
ఆగలేక..ఆపలేక..తన కడుపును మాడ్చలేక...
తిన్నది పాపపు కూడా..?పాపం, కన్నది నరకపు నీడ..!!